RS LEARNING PLATFORM
February 22, 2025 at 05:19 AM
*_ముగ్గురు ఏపీ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారులకు కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు_* హైదరాబాద్‌: తెలంగాణలో పనిచేస్తున్న ముగ్గురు ఏపీ క్యాడర్‌ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులకు కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. మాజీ డీజీపీ అంజనీ కుమార్‌, అభిలాష బిస్త్‌, అభిషేక్‌ మహంతిలను *24 గంటల్లోగా ఏపీ క్యాడర్‌లో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించింది.* తెలంగాణ నుంచి వారిని వెంటనే రిలీవ్‌ చేయాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. 2014లో ఏపీ విభజన అనంతరం ఈ ముగ్గురు అధికారులను ఏపీ క్యాడర్‌కు కేటాయించారు. అయితే వారు సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ (CAT) నుంచి స్టే ఉత్తర్వులు తెచ్చుకొని తెలంగాణలోనే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో తాజాగా వీరిని ఏపీలో రిపోర్ట్‌ చేయాలని హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. 1990 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన అంజనీ కుమార్‌ కేసీఆర్‌ ప్రభుత్వంలో డీజీపీగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన రోడ్డు సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. 1994 బ్యాచ్‌ అధికారిణి అయిన అభిలాష బిస్త్‌ ప్రస్తుతం తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్నారు. 2011 బ్యాచ్‌ అధికారి అయిన అభిషేక్‌ మహంతి కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌గా ఉన్నారు. గతేడాది అక్టోబర్‌లో డీఓపీటీ ఉత్తర్వులతో తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారులు ఆమ్రపాలి, రొనాల్డ్‌ రోస్‌, వాకాటి కరుణ, ఎం.ప్రశాంతి ఏపీకి వెళ్లిన సంగతి తెలిసిందే.
👍 1

Comments