AP Samagra Shiksha Employees JAC
AP Samagra Shiksha Employees JAC
February 20, 2025 at 10:08 PM
కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్య పథకాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు, స్థానిక సంస్థలలో పని చేస్తున్న ఉద్యోగులకు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు మినిమమ్‌ ఆఫ్‌ టైమ్‌ స్కేల్‌ వర్తించదని, ప్రభుత్వ శాఖలలో మంజూరైన ఖాళీ పోస్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు మాత్రమే దీనికి అర్హులని తెలిపే జీవో నెం.2ను రాష్ట్ర ప్రభుత్వం జనవరి 6వ తేదీన విడుదల చేసింది. ఈ జీవో రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కుకు విరుద్ధమైనది. కృత్రిమ ప్రాతిపదికలు సృష్టించి, శ్రమకు తగ్గ వేతనం ఇవ్వకుండా ఉండడమే ఈ జీవో ఉద్దేశం. 2014లో ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన నిరంతర పోరాటాల ఫలితంగా కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు మినిమం టైమ్‌ స్కేల్‌ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 5 ద్వారా ఆ హక్కులను కాలరాశారు. ఇప్పుడు మళ్ళీ అదే విధానాన్ని కొనసాగిస్తూ జీవో 2 తీసుకురావడం ద్వారా అన్యాయం జరుగుతోంది. నిత్యావసర ధరలు భారీగా పెరిగిన ఈ పరిస్థితుల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న ఉద్యోగులు తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే, ఎ.పి లో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సరైన వేతన నిబంధనలు లేకపోవడం బాధాకరం. గతంలో ప్రైవేట్‌ ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల భారీ అవినీతి, ఉద్యోగుల నుండి భారీ వసూళ్లు, ఇ.పి.ఎఫ్‌-ఇ.ఎస్‌.ఐ చెల్లింపుల గోల్‌మాల్‌ వంటి సమస్యలతో ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలాంటి అరాచకాలతో విసుగెత్తిన కార్మికులు ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలను రద్దు చేయాలని అనేక పోరాటాలు నిర్వహించారు. ఈ కారణంగా గత ప్రభుత్వమే ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ను ఏర్పరచి, ఉద్యోగులకు కొంత భద్రత, సక్రమంగా వేతనాలు, పి.ఎఫ్‌, ఇ.ఎస్‌.ఐ లాంటి ప్రయోజనాలు కల్పించింది. ఇప్పుడు ప్రభుత్వం ఈ ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ను రద్దు చేసి, ప్రైవేట్‌ ఏజెన్సీలకు బాధ్యత అప్పగించే ప్రయత్నంలో ఉంది. ప్రైవేట్‌ ఏజెన్సీల ద్వారా ఉద్యోగ నియామకాలను చేపట్టాలన్న ప్రభుత్వ మరో నిర్ణయం మరింత ఆందోళన కలిగించే అంశంగా మారింది. గతంలో ప్రైవేట్‌ ఏజెన్సీల ద్వారా నియామకాలు నిర్వహించినప్పుడు పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగిన దాఖలాలున్నాయి. దీనివల్ల ఉద్యోగ భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. మళ్లీ మధ్యవర్తుల ప్రమేయం పెరుగుతుంది. ఎ.పి ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా ఉద్యోగులను నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలంటే ప్రభుత్వమే నేరుగా నియామకాలు చేపట్టాలి. ఎన్నికల మేనిఫెస్టోలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సంక్షేమానికి వాగ్దానం చేసి, ఏడు నెలలు గడుస్తున్నా ఎలాంటి ప్రయోజకరమైన చర్యలు కనిపించడం లేదు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించేలా సంక్షేమ పథకాలను అమలు చేయాలి. ఆరోగ్య భద్రత, పిల్లల విద్యా సహాయం, ఇంటి అద్దె భృతి, రేషన్‌ సబ్సిడీలు వంటి పథకాలను ప్రత్యేకంగా అమలు చేయాలి. ఉద్యోగుల వేతనాలను పెంచే చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వం కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు వికలాంగుల పెన్షన్‌, ఒంటరి మహిళ పెన్షన్‌, వృద్ధాప్య పెన్షన్‌ తొలగించింది. వీటిని పునరుద్ధరించి ఔట్‌సోర్సింగ్‌ ద్యోగులకు తోడ్పాటు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ప్రభుత్వం ఆదర్శ యజమానిగా వ్యవహరించి, ఉద్యోగుల హక్కులను పరిరక్షించాలి. రాష్ట్రంలోని మూడు లక్షల మందికిపైగా ఉన్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు తగిన భద్రత, సురక్షిత వేతనం అందించాలి. ప్రభుత్వం తక్షణమే జీవో 2ను సవరించి, ఉద్యోగులకు మినిమం టైమ్‌స్కేల్‌ అమలు చేయాలి. రాజ్యాంగం కల్పించిన సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కోసం కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఐక్యంగా ఉద్యమించాలి. ఆధునిక బానిస విముక్తి కోసం పోరాడాలి. – బి.కాంతారావు, రాష్ట్ర కో-చైర్మన్‌, ఎ.పి స్టేట్‌ గవర్నమెంట్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌, టీచర్స్‌ అండ్‌ వర్కర్స్‌ జెఎసి, సెల్‌ : 9490623349

Comments