
Telugu Book Updates
February 10, 2025 at 04:03 AM
నిశ్శబ్ద రణన్నినాదం
-రాఘవ
డాక్టర్ రాషీదా జహాన్ మత చాందసవాదులను ఎదిరించి, కమ్యూనిస్టుగా బ్రిటిష్ పాలననూ ధిక్కరించారు. మతోన్మాదులు చంపేస్తామని బెదిరించినా లెక్కచేయలేదు. ప్రొగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ ను 1936లో ఏర్పాటు చేసినప్పుడు, ప్రేమ్ చంద్ ను అధ్యక్షులుగా ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించారు. కరుడు గట్టిన సంప్రదాయాలకు, అంధ విశ్వాసాలకు, స్త్రీల అణచివేతకు వ్యతిరేకంగా ఆమె రాసిన కథలు ఈ అసమసమాజంపైన చేసిన నిశ్శబ్ద రణన్నినాదాలుగా మిగిలిపోయాయి. కేవలం 47 ఏళ్ల వయసులో, 1952లో క్యాన్సర్ తో రాషీదా జహాన్ కన్నుమూశారు. ఆమె రాసిన కథలను ‘ఆమె కాలిపోయింది’ పేరుతో అనుసృజన చేయడం ద్వారా డాక్టర్ గీతాంజలి మళ్లీ రాషీదా జహాన్ ను తెలుగు పాఠకుల ముందు సజీవంగా నిలబెట్టారు.
ఇఫ్తార్
జాతీయోద్యమంలో దేశం కోసం ప్రాణాలర్పించడానికి యువకులు ముందుకొస్తున్నారు. అస్గర్ వాళ్ళతో దోస్తీ చేస్తూ, బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పెత్తనం గురించి నసీమన్ కు ఉత్తరాలు రాసేవాడు. ఇద్దరికీ నిఖా జరిగిపోతుంది. తానూ ఉద్యమంలో పాల్గొనాలనే నసీమా ఆసక్తిని నీరుకారుస్తాడు. పైగా తనను ఉద్యమానికి దూరం చేసింది నసీమానేనని నమ్మేటట్టు చేస్తాడు. ‘‘దోజక్(నరకం) అంటే ఏంటి అమ్మీ’’ అని అడుగుతాడు ఆరేళ్ళ కొడుకు అస్లం. ‘‘బీద వాళ్ళున్న చోట నరకం ఉంటుంది. వాళ్ళ కక్కడ తిండి దొరకదు. దోజక్ లో ఉండే గరీబులని జన్నత్(స్వర్గం)లో ఉండే డబ్బున్న వాళ్ళు ఇళ్ళలోకి రానివ్వరు’’ అంటూ వివరిస్తుంది తల్లి నసీమా. ఆకలితో ఆ వీధిలో ఉన్న గుడ్డి ఫకీరుకు బేగం సాహెబా ఇచ్చిన పాచిపోయిన జిలేబీలను నోట్లో పెట్టుకోబోతే, జారిపడిపోయింది. అతను కుప్పకూలిపోతాడు. కుక్కలు చుట్టుముట్టాయి. ఆ గుడ్డి ఫకీరును చూసి ఖాన్లు ఎగతాళిగా నవ్వుతున్నారు. ‘‘నీచుల్లారా వెళ్ళండిక్కడి నుంచి’’ అంటూ ననీమా వాళ్ళని తరిమేసింది. ‘‘అస్లం నువ్వు పెద్దయ్యాక ఈ దోజఖ్ (నరకం) ని పూర్తిగా మాయం చేయాలి’’ అంటూ, భర్తలో ముగిసిన ఆదర్శాలను కొడుకులో ఆశగా చూసుకుంటుంది ‘ఇఫ్తార్’లో.
ఆసిఫ్ జహాన్ కోడలు
కుబరా బేగంకి పాతికేళ్ళు వచ్చేసరికి ఐదుగురు మగపిల్లలు. ఆడపిల్లలు పుట్టకపోవడమే అదృష్టం అనుకుంటారంతా. మళ్ళీ ప్రసవ సమయం వచ్చేసింది. ఇంటి నిండా ఆడబిడ్డలు, మరదళ్ళు, ముసలి వాళ్ళు, పెళ్ళి కాని పిల్లలు, చిన్న పిల్లలతో సందడిగా ఉంది. ఒక పక్క కుబరా బేగం పురిటి నొప్పులతో అవస్థ పడుతోంది. ‘‘ఇంకొంచెం బలంగా.. ఆ.. అయిపోయింది.. ఒక్క సారి ఇంకా జోరుగా తొయ్యి..’’ అని చుట్టూ చేరిన ఆడవాళ్ళు అరుస్తున్నారు. కుబరా బేగం ఉన్నట్టుండి పెద్ద కేకవేసింది. వెంటనే పసిపాప ఏడుపు వినిపించింది. కుబరాకు కూతురు పుడితే తన కొడుక్కి చేసుకోవాలని అసిఫ్ జహాన్ ఆశ. మాయ పడక కుబరా బేగం ప్రాణాపాయంలో పడి పోయింది. మరొక పక్క మహిళలంతా తమ ప్రసవ అనుభవాలను ముచ్చటించుకుంటున్నారు. కుబరా బేగం పొట్టమీద ఒత్తుతుంటే ‘‘చచ్చిపోతున్నా వదలండి’’ అంటూ అరుస్తోంది. మాయపడిపోయింది. ఒక శిశువు భూమిపైకి వచ్చేసిందని సందడి, సంరంభం, ఉద్వేగం అన్నిటినీ దృశ్యమానం చేసిన కథ ‘ఆసిఫ్ జహాన్ కోడలు.
చిద్దా వాళ్ళమ్మ
నవాబుల ఇళ్ళలో పనిచేసే చిద్దా వాళ్ళమ్మ వందసార్లైనా కొడుకు చేత కోడల్ని కొట్టించి ఉంటుంది. అసలు ఎంత అమాయకమైన ముఖం ఆ కోడలిది? ‘‘ఇంట్లో ఇట్లా కాలు పెట్టిందో లేదో చిద్దా వాళ్ళ నాన్నను గుటుక్కున మింగేసింది’’ అంది కోడలి గురించి చిద్దా వాళ్ళమ్మ. అంతే..ఆమె కోడల్ని చంపేసింది. చిద్దాకు కొత్త భార్య వచ్చేసింది. ముసల్ది అరుస్తూనే ఉంటుంది. కొడుకుతో కోడలి గురించి చెడ్డగా చెపుతూనే ఉంటుంది. ఉడుకుతున్న పప్పులో దొంగతనంగా ఉప్పు ఎక్కవ వేసేస్తుంది. చిద్దా ఇంట్లోకి రాగానే ‘‘ఈ దరిద్రపుది పక్కింటి ఈదుగాడితో కలిసి కులుకుతోంది’’ అంటూ కోడల్ని పట్టుకుని కొట్ట సాగింది. దీంతో చిద్దా ఆమెను కూడా వదిలేశాడు. ఇప్పుడొచ్చిన మూడవ కోడలు చిద్దా వాళ్ళమ్మని మించిపోయింది. పాత కోడళ్ళందరి తరపునా కక్షతీర్చుకుంది. ‘‘నేను ఈ ఇల్లు వదిలి ఎటూ పోను. భయపడిపోయిన పాత కోడళ్ళ లాగా పిరికి దాన్ని కాను. ఈ ఇంట్లో ఉండాలంటే బుద్దిగా ఉండు. లేకపోతే నీ దారిన నీవు వెళ్ళపో’’ అనేసింది. ఇక చిద్దాగాడైతే భార్యకు బానిసైపోయాడు. కోడళ్ళను హింసించే అత్తలకు ‘చిద్దా వాళ్ళమ్మ’ చక్కని ప్రతీక.
సిద్ధిఖా బేగం కన్నీళ్లు చెప్పే విషాదం
ఇద్దరు అక్కలకు పెళ్ళిళ్లైనా, చూడచక్కనిదైనా సిద్ధిఖా బేగంకు పెళ్ళి కాలేదు. పెళ్ళి కాకపోయినా పరవాలేదు కానీ, నిఖాకి ముందే అబ్బాయికి అమ్మాయిని చూపించకూడదనేది తల్లి అహ్మదీ బేగం మొండితనం. తండ్రి హమీద్ హసన్ ఆధునిక పద్ధతులకు వ్యతిరేకం. సిద్ధిఖా బేగంను పూర్తిగా పరదాల్లో పెంచారు. ‘‘ఒక్కడే కొడుకైనా, నూట యాభై రూపాయలు జీతం వచ్చినా, సిద్దికా బేగంను చూశాకే నచ్చిందో లేదో చెప్పాననడమే నాకు నచ్చలేదు. జీవితమంతా పెళ్ళి కాకుండానే ఉంచమంటే ఉంచుతా. కానీ ఇలాంటి పిచ్చి పనులు చేయను ’’ అంది అహ్మదీ బేగం. ‘ముప్పై ఏళ్ళు వచ్చినా అమ్మీ ఇప్పట్లో తనకు నిఖా చేయదు. తనకా చేయమని చెప్పే ధైర్యం లేదు. మంచంపైన ఒరిగిపోయి కుళ్ళి కుళ్ళి ఏడవ సాగింది ‘నోరు లేని సిద్ధికా బేగం’.
ఆమె కాలిపోయింది
ఆమె పెదవుల మీద లిప్ స్టిక్ అలానే ఉంది. బట్టలు కాలిపోయి ఆమె దేహం నగ్నంగా కనిపిస్తోంది. ఛాతీ మొత్తం కాలిపోయి నల్లగా తయారైంది. ఒక కాలు కాలిపోయి బిగుసుకుపోయి పైకి లేచి భీకరంగా కనిపిస్తోంది. గదిలో మంచంపైన కాలిన విమల మృతదేహం.
స్వర్గంలాంటి ఆ మహల్లో పట్టు తివాచీలు పరిచి ఉన్నాయి. తెల్లగా, బొద్దుగా, చక్కగా ఉండే విమలకు ఏడెమినేళ్ళ వయసున్నప్పటి నుంచి అతను చూస్తున్నాడు. మహల్ నుంచి వచ్చే విమల కోసం అతని మనసు గంతులేసేది. ‘‘నువ్వీ తక్కువ రకం మనుషులతో ఆడుకోవడం నాకిష్టం లేదు’’ అనేది పెద్దావిడ. విమలకు పదహారేళ్ళ వయసులో ఒక రాజాతో పెళ్ళైంది. రోజూ ఇంట్లో వంటకాల ఘుమఘుమలు, ఏనుగుల సవారీలు. రాజుగారు బంగారు వజ్రాలతో మెరిసిపోతున్నారు. ఆమె మోటార బండి నుంచి నలువైపులా వెదజల్లే డబ్బుల కోసం బీద జనం తన్నుకు చస్తున్నారు. వెళ్ళిన పదిరోజుల కల్లా విమల అత్తారింటి నుంచి తిరిగి వచ్చేసింది. తన చెల్లెలు, తల్లిలా స్వేచ్ఛగా మారిపోయింది. ఒక సారి ఆఫీసర్ తో, మరొక సారి మిలటరీ ఆఫీసర్ కొడుకుతో కనిపిస్తుంది. ప్రతి సారి ఒక మగవాడితో ఎందుకుంటుంది విమల? ఇవ్వన్నీ ఆమె గురించిన సందేహాలు, జ్ఞాపకాలు. ‘‘నేను ఎన్నో సార్లు చెప్పాను ఇంతగా తాగొద్దని. ఆమె నన్ను కొట్టినా నేను ఇచ్చేదాన్ని కాను. ఆ దరిద్రుడు బ్రిగేడియర్ ఎన్ని మందు బాటిళ్ళు తెచ్చాడని రాత్రి. రాత్రి మూడు గంటలకు ఆ దరిద్రుణ్ణి ఇంట్లోంచి పంపేశాను. నాకు గాఢమైన నిద్ర పట్టింది. అతను వెళ్ళిపోయాక బిడ్డ ఇంకా తాగి ఉంటుంది. సిగరెట్టు వెలిగించి తాగుతూనే నిద్రపోయి నిప్పంటుకుని చనిపోయి ఉంటుంది. విమలాదేవి తల్లిగారే తాగుతారు. అక్కడ ఎవరు తాగరని! ’’ముసలామె ఆయాసపడుతూ చెప్పింది.
బ్రిగేడియర్, సివిల్ సర్జన్, ఇంకా పెద్ద పెద్ద ఆఫీసర్లున్నారు. పెద్ద రాణి గారికి పోస్ట్ మార్టం చేయమని వాదా చేశారు. వ్యసనాలకు బానిసలైన డబ్బున్న వారి జీవితాలు ఎలా ఉంటాయో ‘ఆమె కాలిపోయింది’ సజీవంగా చూపిస్తుంది.
గుడ్డివాని చేతి కర్ర
‘‘నా కూతుళ్ళిద్దరిని జీవితమంతా అవివాహితలుగానైనా ఉంచుతా కానీ, ఇద్దరికీ విషం తినిపించి చంపేయనైనా చంపేస్తా కానీ, అన్గర్ పిల్లలతో తన పిల్లలకు నిఖా మాత్రం చేయను’’ అంటుంది ఇక్బాల్ భార్య. కవలపిల్లలైన అహ్మదీ ఖాదరీలకు బైట సంబంధాలు కుదరడం లేదు. అస్గర్, ఇక్బాల్ అన్నదమ్ములు. వారి భార్యలు పోట్లాటలతో వీధికెక్కుతుంటారు.
హిందువుల్లో అక్క కూతురిని పెళ్ళి చేసుకున్నట్టు, ముస్లిం కుటుంబాల్లో అన్నదమ్ముల పిల్లల మధ్య పెళ్లిళ్లు జరుగుతాయి. తమ్ముడి కూతుళ్ళను తన కోడళ్ళుగా చేసుకోవాలని అస్గర్, అతని భార్య భావిస్తారు. వేరే సంబంధం చేస్తే తమ్ముడి ఆస్తి కాస్తా పోతుందని వారు భావిస్తారు.
దార్మికుడైన ఢిల్లీలో సయ్యద్ హసన్ సాహెబ్ ఇద్దరు మగ కవలపిల్లలకు, ఇక్బాల్ ఇద్దరు కవల పిల్లలకు పెళ్లి జరుగుతుంది. ఇద్దరు పెళ్లి కొడుకులు, ఇద్దరు పెళ్లి కూతుళ్లు కవల పిల్లలు కావడంతో ఒకేలా ఉంటారు. పడకగదిలో పెళ్లి కూతుళ్ళు మారిపోతారు. ఏం చేయాలో తోచక పెళ్లి కొడుకులు, పెళ్లి కూతుళ్లు కుమిలిపోతుంటారు. తోడికోడళ్ల ద్వేషం ‘గుడ్డివాని చేతికర్ర’లా తయారవుతుంది.
షీలా
నలభై ఏళ్ళ వయసుండే షీలా అందమైన అవివాహిత. అందరికీ తలలో నాలుకలా ఉంటుంది. షీలాకి పజ్జెనిమిదేళ్ల వయసున్నప్పటి నుంచి హరీష్ చంద్ర అనే వివాహితుడి ప్రేమలో పడిపోయింది.
‘‘స్త్రీ పురుషుల్లో చాలా తేడా ఉంటుంది షీలా. ఆమె మనసు, దేహం విడివిడిగా ఉండలేవు. అవి కేవలం ఒక వ్యక్తికి మాత్రమే చెంది ఉంటాయి. అలా కాకపోతే ఆ స్త్రీకి, వేశ్యకు ఏం తేడా ఉంటుంది చెప్పు?’’ అంటాడు హరీష్ చంద్ర.
‘‘అలాగా..మరి పురుషుల సంగతేంటి?’’ అంటుంది షీలా. ‘‘హూ..నలభై ఒక్క ఏళ్లున్న నేను అమాయకురాలైన షీలాని. ముసలిదాన్నై పోయిన షీలాని’’ అంటూ పెద్దగా నవ్వుతుంది.
ఒక్కసారిగా లేచి ధైర్యంతో ‘‘ ఖచ్చితంగా నువ్వు మగవాడివే, సందేహం లేదు. ఈ లోకంలో పురుషులంతా ఒక్కలాగే ఉంటారు. కానీ నువ్వు చాలా మోసగాడివి. కుట్రదారుడివి. పంతొమ్మిదేళ్ళ వయసులో నీతో నాకు పరిచయం అయ్యింది. నిన్ను చూసిన తరువాత నీ ఉచ్చులో పడిపోయి నిన్ను ప్రేమించసాగాను. వయస్సులో నీవు నాకంటే పెద్దవాడివి. పెళ్లై ఇద్దరు పిల్లలున్న తండ్రివి కూడా. నాకు ‘నువ్వంటే చచ్చేంత ప్రేమ’ అని చెప్పించుకున్నావ్. తర్వాత నన్నసలు గుర్తుపట్టనట్టు అపరిచతుడిలా ప్రవర్తించడం మొదలు పెట్టావ్. ‘స్త్రీ తన జీవితంలో ఒక్కరినే ప్రేమిస్తుంది’’ అని నమ్మిస్తూ పోయావు. నాలో పుట్టే ఏ కొద్దిపాటి కోరికల్ని కూడా నేను గొంతు నులిమేశాను. వెళ్లు.. వెంటనే వెళ్లిపో..’’ అంటూ ఆగ్రహంతో అరుస్తూ తలుపు వైపు వేలు చూపించి తన గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది.
నవ యవ్వనుడైన ఒక మిలటరీ ఆఫీసర్ షీలా మీద మనసు పారేసుకున్నాడు. షీలా కూడా అతన్ని ప్రేమించింది. షీలాపై మోహం అతన్ని పూర్తి స్థాయి పురుషుడిగా మార్చివేసింది. ప్రకృతికున్న శక్తి అది. షీ లా జీవితాన్ని ఒక అందమైన విషాద కావ్యంగా రాషీద్ జహాన్ చూపించారు.
పరదా వెనుక
‘‘ప్రతి ఏడాది నేను పిల్లల్ని కంటూనే ఉన్నాను. ఇక పిల్లలు వద్దని గొడవ పడ్డాను. నా చెంప పగుల కొట్టాడు.’’ ‘‘పిల్లలికి పాలిచ్చి అందం చెడుపుతున్నావనుకో, నేను ఇంకో నిఖా చేసుకుంటాను. అనుభవించడానికి నాకెప్పుడూ ఒక ఆడది ఉండాలి’’ అంటాడతను ‘‘ క్రైస్తవులుగా పుట్టి ఉంటే బాగుండేది. వాళ్లలో పిల్లలు పుట్టకుండా చేసుకునే ఆపరేషన్లు ఒప్పుకుంటారని విన్నాను.’’ ‘‘ నా సోహార్ బయటి మొహల్లాల్లోని వేశ్యల దగ్గరకు వెళుతుండే వాడు. ఆ సమయంలో నేనెంత ప్రశాంతంగా నిద్రపోయే దాన్నో. రాత్రిళ్లు ఆయన పెట్టే నరకం తప్పింది నాకు. మన ఇస్లామిక్ కానూనిలో మగవాడికి నాలుగు సార్లు నిఖా చేసుకోవడానికి అనుమతి ఉన్నప్పుడు నేను రెండో నిఖా ఎందుకు చేసుకోకూడదు?’ అంటాడు.’’ అంటూ ‘పరదా వెనుక’ నాటకంలో ఇద్దరు స్త్రీల మధ్య జరిగే సంభాషణలో మొహమ్మదీ బేగం చెప్పే మాటలు ఆనాటి ముస్లిం స్త్రీల స్థితి గతులకు అద్దం పడుతుంది. అలాగే మరో నాటిక ‘స్త్రీ పురుషుడు’లో కూడా ఇలాగే సంభాషణ జరుగుతుంది. రాషీదా జహాన్ ఈ కథలు రాసి వందేళ్ళు అయినప్పటికీ, హైదరాబాదు పాత బస్తీ లోని ముస్లిం స్త్రీల స్థితి గ తులు ఇంకా అలానే ఉన్నాయి.
పుస్తకం పేరు : ఆమె కాలిపోయింది.
రచయిత్రి : డాక్టర్ రాషీదా జహాన్
అనువాదం : డాక్టర్ గీతాంజలి
పుస్తక పరిచయం : రాఘవ
పేజీలు : 142
వెల : 150
కాపీలకు : పుస్తకం.ఇన్ 7989546568
డాక్టర్ : గీతాంజలి, 8897791964