
Venukumar Study Guide
January 30, 2025 at 12:07 AM
*🔊Telangana News: ‘పది’ విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం*
*🔶ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు అందజేత*
*🔷పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు*
*🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, మోడల్ స్కూళ్లలో పదో తరగతి చదువుతూ ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు సర్కారు సాయంత్రం పూట అల్పాహారం అందించనుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. దసరా తర్వాత చాలా చోట్ల ఇవి మొదలయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం తింటే.. ప్రత్యేక తరగతులు పూర్తయి ఇళ్లకు వెళ్లేసరికి ఇతర గ్రామాల విద్యార్థులకు రాత్రి 7 గంటలవుతోంది. అప్పటి వరకు ఏమీ తినకపోవడంతో ఆకలితో ఇబ్బంది పడుతున్నారు. గతంలో కలెక్టర్ల నిర్ణయం మేరకు కొన్ని జిల్లాల్లో సాయంత్రం పూట స్నాక్స్ అందించేవారు. 2023లోనూ విద్యాశాఖే ‘సమగ్ర శిక్ష’ ద్వారా 34 రోజులపాటు వాటిని అందించేలా ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది మాత్రం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో అమలు కాలేదు. ఈసారి మార్చి 21వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు మొదలవుతున్నందున ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20వ తేదీ మధ్య పాఠశాలలు నడిచే 38 రోజులపాటు అల్పాహారం ఇవ్వనున్నారు.*
*💥ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15*
*🌀స్నాక్స్ కోసం ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 చొప్పున మంజూరు చేయనున్నారు. రాష్ట్రంలోని దాదాపు 4,500 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 194 మోడల్ స్కూళ్లలో సుమారు 1.90 లక్షల మంది పదో తరగతి చదువుతున్నారు. అంటే 38 రోజులకు సుమారు రూ.11 కోట్ల బడ్జెట్ అవసరమని అంచనా వేశారు. ఉడకబెట్టిన పెసర్లు, పల్లీలు-బెల్లం, చిరుధాన్యాలతో చేసిన మిల్లెట్ బిస్కెట్లు, ఉడకబెట్టిన బొబ్బర్లు, ఉల్లిపాయ పకోడి, ఉడకబెట్టిన శనగల్లో రోజుకు ఒక రకం ఇవ్వనున్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీల మహిళలే వాటిని సరఫరా చేస్తారు.*
🙏
1