
Venukumar Study Guide
January 30, 2025 at 01:00 AM
*🔊ISRO: ఇస్రో సెంచరీ*
*🔶100వ ప్రయోగం విజయవంతం*
*🔷ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టిన జీఎస్ఎల్వీ-ఎఫ్15*
*🍥శ్రీహరికోట, న్యూస్టుడే: వినువీధిలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సత్తా చాటింది. క్రికెట్లో శతకం కొట్టిన బ్యాటర్ విజయగర్వంతో బ్యాట్ను చూపించిన తరహాలోనే జీఎస్ఎల్వీ రాకెట్ నింగిలోకి దూసుకెళుతుండగా ఇస్రో సగర్వంగా, దిగ్విజయంగా 100వ ప్రయోగ మైలురాయిని అందుకుంది. 27:30 గంటల కౌంట్డౌన్ అనంతరం బుధవారం ఉదయం 6:23 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోట సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్15 వాహకనౌక నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. 19 నిమిషాల తర్వాత ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ (జీటీఓ)లో ప్రవేశపెట్టింది. 2,250 కేజీల ఎన్వీఎస్-02.. స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ (నావిక్)లో రెండో జనరేషన్ ఉపగ్రహం. ఇందులో ఉండే ‘రుబిడియం అటామిక్ ఫ్రీక్వెన్సీ స్టాండర్డ్’ అణు గడియారం ఉపగ్రహానికి కీలకమైంది. భారత్తో పాటు చుట్టుపక్కల 1,500 కి.మీ. ఈ ఉపగ్రహం పరిధిలోకి వస్తుంది. ఉపరితల, వాయు, సముద్ర నావిగేషన్, వ్యవసాయం, శాటిలైట్ల గమన మార్గం, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) తదితరాలకు ఎన్వీఎస్-02 సేవలు ఉపయోగపడతాయని ఇస్రో పేర్కొంది.*
*💥జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్, ఎన్వీఎస్-02 ఉపగ్రహ నమూనాలను చూపుతున్న ఇస్రో ఛైర్మన్ వి.నారాయణన్, శాస్త్రవేత్తలు*
*🔷ఐదేళ్లలో 200 మార్కును అందుకుంటాం!*
*🎙️ఇస్రో అధిపతి వి.నారాయణన్*
*🌀వచ్చే ఐదేళ్లలో రెండు వందల ప్రయోగాల మార్కును అందుకుంటామని, అది సాధ్యమేనని ఇస్రో అధిపతి వి.నారాయణన్ ధీమా వ్యక్తం చేశారు. సంస్థ వందో మిషన్ జీఎస్ఎల్వీ-ఎఫ్15 ప్రయోగం విజయవంతమైన తర్వాత ఆయన శ్రీహరికోటలో మీడియాతో మాట్లాడారు. శాస్త్రవేత్తల కృషికి ప్రతిఫలం దక్కిందని, ప్రయోగం విజయవంతమైందని ప్రకటించారు. ఇప్పటి వరకు ఇస్రో ఆరు తరాల రాకెట్లను అభివృద్ధి చేసిందని, 1979లో ఏపీజే అబ్దుల్కలాం ప్రాజెక్టు డైరెక్టర్గా, సతీశ్ ధవన్ మార్గదర్శకత్వంలో మొదటి రాకెట్ రూపుదిద్దుకుందని గుర్తుచేసుకున్నారు. ‘1976లో ఎస్ఎల్వీ-3తో మొదలైన ఇస్రో ప్రయాణం 46 ఏళ్లకు 100 రాకెట్ ప్రయోగాల మైలురాయిని అందుకుంది. ఈ కాలంలో 433 విదేశీ ఉపగ్రహాలు సహా 548 శాటిలైట్లను కక్ష్యలోకి చేర్చాం’ అని పేర్కొన్నారు. 100 రాకెట్ ప్రయోగాలు చేపట్టడానికి 46 ఏళ్లు పట్టిందని, 200 మార్క్ను ఐదేళ్లలో చేరుకోగలమా అనే ప్రశ్నకు నారాయణన్ సమాధానం ఇస్తూ ఆ లక్ష్యం కోసం ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తితో ముందుకు వెళతామన్నారు.*
*💥ఈ ఏడాదంతా బిజీ షెడ్యూల్..*
*💠ఈ ఏడాది కీలకమైన మిషన్లు చేపట్టాల్సి ఉందని నారాయణన్ వెల్లడించారు. మార్చిలో నాసా ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ (నిసార్) ప్రయోగం ఉంటుందని, ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎర్త్ ఇమేజింగ్ ఉపగ్రహమని తెలిపారు. దీనిని రూ.12,500 కోట్ల్లతో రూపొందించినట్లు చెప్పారు. తర్వాతి నావిగేషన్ శాటిలైట్ను ఆరు నెలల్లో ప్రయోగిస్తామని, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) కోసం ఓ వాణిజ్య ప్రయోగంతో పాటు టీడీఎస్-01 మిషన్ చేపడతామని వివరించారు. భవిష్యత్తు ప్రయోగాలకు కీలకమైన నెక్ట్స్ జనరేషన్ లాంచ్ వెహికల్ (ఎన్జీఎల్వీ) తయారీకి కేంద్రప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని నారాయణన్ తెలిపారు. గగన్యాన్ మిషన్ సాధనకు వేగంగా ముందుకెళుతున్నామని, ఈ ఏడాది అన్ క్రూ మిషన్ చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నారాయణన్ వెల్లడించారు.*
*💥అద్భుతమైన మైలురాయి: ప్రధాని మోదీ*
*🥏దిల్లీ: ఇస్రో చేపట్టిన 100వ ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. అద్భుతమైన మైలురాయిని అందుకున్నారని శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ విజయం దేశ శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల శ్రమ, చిత్తశుద్ధికి ఫలితం. ప్రైవేటు రంగం సహకారంతో భారత అంతరిక్ష రంగం సరికొత్త ఎత్తుల వైపు వేగంగా పయనిస్తుంది’ అని పేర్కొన్నారు.*
👍
1