
Telugu News International - TNILIVE
February 19, 2025 at 02:45 AM
మహారాష్ట్రలోని పుణెలో ఓ మహిళ తన 3బీహెచ్కే ఫ్లాటులో ఏకంగా 350కు పైగా పిల్లులను పెంచుతోంది. ఈమె మార్జాల ప్రేమ ఇరుగు పొరుగు ఫ్లాట్లకు తలనొప్పి వ్యవహారంగా మారింది. పుణెలోని హడప్సర్ ప్రాంతంలో గల ఓ సొసైటీ అపార్ట్మెంటు నాలుగో అంతస్తు ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాటులో ఆ మహిళ నివసిస్తోంది. పిల్లులంటే విపరీతమైన ఇష్టం ఉండటంతో ఆమె క్రమక్రమంగా తన ఇల్లంతా పిల్లులతో నింపేసింది. ఈ పిల్లులు పరిసర ప్రాంతాల్లో భయంకరమైన దుర్వాసనను వ్యాపింపజేస్తున్నాయి. పిల్లి కూతలతో రోజంతా చికాకు పెడుతున్నాయి. వాటిని చూసి అపార్ట్మెంటులోని పిల్లలు భయపడుతున్నారు. ఇబ్బందిగా ఉందని ఇరుగు పొరుగు చెప్పినా ఆమె పట్టించుకోలేదు. దీంతో అందరూ కలిసి పోలీసులకు, మున్సిపల్ కార్పొరేషనుకు ఫిర్యాదు చేశారు. సొసైటీ సభ్యుల ఫిర్యాదు మేరకు సోమవారం మహిళ ఇంటిని తనిఖీ చేసిన అధికారులు 48 గంటల్లోపు పిల్లులను ఫ్లాటు నుంచి ఖాళీ చేయకపోతే తామే ఆ పని చేస్తామని నోటీసు ఇచ్చారు.
