
అంతర్యామి
February 1, 2025 at 03:20 PM
*ఓం నారాయణ ఆదినారాయణ*
_*అవధూత లీల*_
రచన : పెసల సుబ్బరామయ్య
ఒకొక్కప్పుడు సేవకుల చేతిలో పైసా ఉండదు. "ఇప్పుడే తిరువళ్లూరు పోవాలి, కదలండి. నెల్లూరు, జొన్నవాడ, కంచి మొదలగు దేవస్థానములకు
పోవాలంటారు శ్రీస్వామివారు. “డబ్బు లేదు స్వామి!" అంటే "వస్తుంది కదలండయ్యా!” అని తొందర చేసేవారు. శ్రీస్వామివారు చెప్పినట్లే ప్రయాణానికి ఎవరో ఒకరు వచ్చి దక్షిణ రూపంలో అవసరమైనంత డబ్బు సమర్పించి పోయేవారు.
ఒక మిట్ట మధ్యాహ్నం తలుపూరులో భక్తులు అన్నం వండుతున్నారు. “వెంటనే కదలండి. ఒక్క క్షణం ఉండకూడదు" అని సేవకులు ప్రయాణమైన దాకా ఊరుకోలేదు. అన్నం ఉడుకుతుందంటే "అన్నం వస్తుందిలే పదండయ్యా” అన్నారు. అన్నం ఆశ వదిలేసి బస్టాండుకొచ్చారు. పొదలకూరు వైపు వెళ్ళే బస్సు వచ్చింది. "ఇది కాదయ్యా మన బస్సు. తరువాత బస్సుకు పోదాం” అన్నారు. “ఈ పాటికి అన్నం తిని వచ్చే వాళ్లముగదా స్వామీ” అంటే “అన్నం వస్తుందయ్యా ఉండండి" అన్నారు. "డబ్బు లేదు స్వామీ చార్జీలకు" అంటే "పై వాళ్ళు పంపుతారులే" అన్నారు. అన్నట్లే కొంత సేపటిలో పొట్టేపాళెం ఆదిలక్ష్మమ్మగారు స్వామి దర్శనార్థం కారులో వచ్చి గంపలో దోశలు, వడలు, పొంగలి, పులిహోరా మొదలైన పదార్థాలు తెచ్చి తృప్తిగా తినబెట్టి అవసరానికంటే ఎక్కువగా దక్షిణ సమర్పించి వెళ్ళారు.
ఒక్కొక్కప్పుడు ఒకే ఊరిలో రెండు, మూడు చోట్ల మకాం మార్పించేవారు. ఫలానా దిశ వైపు పోవాలంటే ఎంత యిబ్బందిగానీ, మార్గం దుస్తరంకానీ వెళ్ళి తీరాల్సిందే. అన్నం తిననీ, తినకపోనీ, ఎండనక, వాననక, వెళ్ళాలంటే వెళ్ళితీరాలి. శ్రీస్వామివారు నడిచేటప్పుడు కూడా అలానే తిరిగేవారు.
అడవిలో శ్రీస్వామివారు ఏంచేస్తారో చూడాలని అనేక మంది ప్రయత్నించారు. కాని ఎవరైనా తనను వెంబడించినట్లు తెలుసుకున్నారంటే వెంటనే ముండ్లలో అడ్డదిడ్డంగా నడిచేవారు. ఆ ముండ్లలో నడవలేక అలా ప్రయత్నించినవారు వెనుతిరిగి వచ్చేవారు.
పండ్లు తోమటం, పుక్కిలించడం అనేది లేదు. చప్పరిస్తున్న పొగాకు వుమ్మేసి వెంటనే గంజి త్రాగేవారు.
🙏
1