⚡SchoolEdu 👈 Join Now
June 21, 2025 at 12:47 AM
*🔊UPS: యూనిఫైడ్ పింఛనుపై సంకటస్థితి!*
*🔶బెంచ్మార్క్ కార్పస్ ఫండ్పై కొరవడిన స్పష్టత*
*🔷యూపీఎస్లోకి మారేందుకు కేంద్ర ఉద్యోగుల నిరాసక్తి*
*🍥ఈనాడు, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తరువాత కచ్చితమైన పింఛను ఇచ్చేందుకు ఉద్దేశించిన ‘యూనిఫైడ్ పింఛను పథకం (యూపీఎస్)’పై అనేక సందేహాలు ముసురుకున్నాయి. యూపీఎస్లో చేరాలని సూచిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సరైన స్పష్టత ఇవ్వడం లేదు. ఈ స్థితిలో తెలుగు రాష్ట్రాల్లోని 12 వేల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. పూర్తి పింఛనుకు కనీస సర్వీసు, ముందస్తు ఉపసంహరణ (విత్ డ్రా)లపై ఆంక్షలు, బెంచ్మార్క్ కార్పస్ నిధి తదితరాలపై స్పష్టమైన వివరణలు లేకపోవడంతో ఉద్యోగులు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. 2004 తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారు.. ప్రస్తుత జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్)లో కొనసాగాలా? లేక కొత్తగా తీసుకువచ్చిన యూపీఎస్లో చేరాలా? అనే విషయమై సంకటస్థితి నెలకొంది. ఒకసారి యూపీఎస్లో చేరితే తిరిగి ఎన్పీఎస్లోకి వెళ్లే అవకాశాన్ని కేంద్రం తొలగించింది. యూపీఎస్లో చేరేందుకు ఈ నెల 30ని చివరి తేదీగా నిర్ణయించడంతో ఉద్యోగులంతా ఈ నెల 28లోగా ఆప్షన్ ఇవ్వాలని సంబంధిత ఎకౌంట్స్ అధికారులు గడువు విధించారు.*
*💥పూర్తి పింఛను ఎవరికి వస్తుందంటే..*
*💠యూపీఎస్లో చేరిన ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం వేతనంలో సగం మొత్తం పింఛనుగా (దీన్నే పూర్తి పింఛనుగా వ్యవహరిస్తారు) రావాలంటే కొన్ని నిబంధనలు పేర్కొంది. కనీసం 25 ఏళ్ల సర్వీసు పూర్తిచేయాలి. ఉద్యోగి, యజమాని వాటా నిధులు ఒక్కనెల కూడా పొరపాటు లేకుండా నిరంతరాయంగా పీఎఫ్ఆర్డీఏ వద్ద జమ కావాలి. 25 ఏళ్ల కన్నా తక్కువ సర్వీసుతో పదవీ విరమణ చేసినా, స్వచ్ఛంద పదవీ విరమణ చేసినా ఆ మేరకు పింఛనులో కోత పడుతుంది. కార్పస్ నిధి నుంచి ఒక్క రూపాయి కూడా పాక్షిక ఉపసంహరణ (విత్ డ్రా) చేయకూడదు. ఉద్యోగి డిఫాల్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. ఈ నిబంధనలన్నీ పాటిస్తేనే పూర్తిపింఛను వస్తుంది. అయితే యూపీఎస్లో పింఛను అర్హత పొందేందుకు కనీసం పదేళ్ల సర్వీసు పూర్తిచేసి ఉండాలి.*
*💥ఉపసంహరణ చేసినా, సర్వీసు తగ్గినా...*
*➡️యూపీఎస్లో చేరిన ఉద్యోగులు వేతనం నుంచి 10 శాతం కార్పస్నిధికి జమ చేస్తే.. కేంద్రం 18 శాతం జమ చేస్తుంది. ఈ మొత్తాన్ని ఎన్పీఎస్లో పెట్టుబడి పెడతారు. అవసరాల కోసం నిధిని ఉపసంహరించుకునే అవకాశమిచ్చినా, అలా నగదు విత్ డ్రా చేస్తే.. పింఛను తగ్గుతుంది.*
*➡️ఉదాహరణకు... ఒక ఉద్యోగి రిటైరయ్యే నాటికి మూలవేతనం, డీఏ కలిపి రూ.45 వేలు ఉండి.. అతడు ఒక్క రూపాయి కూడా వెనక్కు తీసుకోకుంటే నెలకు రూ.22,500 పింఛను వస్తుంది. విత్ డ్రాల ద్వారా బెంచ్మార్క్ కార్పస్ నిధికి ఎంత తక్కువైతే.. పింఛను లెక్కింపులో ఆ మేరకు కోత తప్పదు. ఒకవేళ కార్పస్ నిధి కన్నా ఖాతాలో ఎక్కువ సొమ్ము ఉంటే.. పీఎఫ్ఆర్డీఏ ఆ మొత్తాన్ని ఉద్యోగి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది.*
*➡️పదవీ విరమణ సమయంలో ఉద్యోగులకు గ్రాట్యుటీతో పాటు ఒకేసారి చెల్లింపు కింద.. ప్రతి ఆరునెలలకోసారి చివరి వేతనంలో పదోవంతు నగదు ఇవ్వనుంది. కనీసం పదేళ్ల సర్వీసు పూర్తిచేసిన వారికే ఈ ప్రోత్సాహకం అందుతుంది. అంటే పదేళ్ల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగికి.. ఆరునెలలకు ఒకటి చొప్పున లెక్కిస్తే మొత్తం 20 నెలలు అవుతుంది. నెలకు 1/10 వంతు వేతనం చొప్పున 20 నెలల మొత్తాన్ని ఆ ఉద్యోగికి ఒకేసారి చెల్లిస్తారు. ఉదాహరణకు ఒక ఉద్యోగి చివరి వేతనం రూ.68,850 ఉంటే... 1/10 వంతు రూ.6885 అవుతుంది. అతడు 15 సంవత్సరాల సర్వీసు పూర్తిచేశారనుకుంటే.. ఆరు నెలలకు ఒక నెల చొప్పున 15 ఏళ్లకు 30 నెలలు అవుతుంది. ఆ ఉద్యోగికి ఏకమొత్తంగా 30్ల6885 చొప్పున రూ.2,06,550 చేతికి అందుతాయి.*
*💥ఉద్యోగుల ఆందోళనకు కారణాలివీ...*
*➡️ఎన్పీఎస్లో కనీసం 60 శాతం నిధిని వెనక్కు తీసుకునే అవకాశముంది. కానీ యూపీఎస్లో ఆ వెసులుబాటు లేదు. ఒకవేళ విత్ డ్రా చేస్తే.. పింఛను తగ్గిపోతుంది.*
*➡️పదవీ విరమణ అనంతరం ఇచ్చే మొత్తాన్ని (పే అవుట్ను) పింఛనుగా చెప్పడం లేదు. కేంద్రం నిర్ణయించినప్పుడు డీఏ ఏ విధంగా లెక్కిస్తారన్న స్పష్టత ఇవ్వలేదు.*
*➡️ఉద్యోగి వేతనం నుంచి చెల్లించిన 10 శాతం నగదు వెనక్కు వచ్చే అవకాశం లేదు. ఉద్యోగి వాటా తీసుకుని పింఛను లెక్కిస్తే పదవీ విరమణ అనంతరం గ్రాట్యుటీ తప్ప చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు.**Click here to Join*
https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m